టోయోహికో కగావా (1888-1960)  ప్రముఖ జపాన్ క్రైస్తవ శాంతికాముకుడు. జపాన్ సువార్తికుడు, మిషనరీ, సంఘ సంస్కర్త, కార్యకర్త, శాంతికాముకుడు

నేటి విశ్వాస నాయకుడు
టోయోహికో కగావా
పరలోక పిలుపు : 23 ఏప్రిల్ 1960
జపాన్ సువార్తికుడు, మిషనరీ, సంఘ సంస్కర్త, కార్యకర్త, శాంతికాముకుడు

టోయోహికో కగావా (1888-1960) ప్రముఖ జపాన్ క్రైస్తవ శాంతికాముకుడు. అహింస, సామాజిక న్యాయం పట్ల ఈయన అచంచలమైన నిబద్ధత కోసం తరచుగా “జపాన్ గాంధీ” అని పిలుస్తారు. కష్టతరమైన బాల్యంలో జన్మించిన ఈయన క్రైస్తవ మతాన్ని స్వీకరించి, సామాజిక అసమానతలను పరిష్కరించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈయన ప్రసంగాలకు అందరూ కట్టుబడి ఉండుటకు సిద్ధంగా ఉండి మేలు పొందినవారు అనేకులు. ఇదే అదునుగా క్రీస్తు ప్రేమను ప్రకటించి ఎంతోమందిని ప్రభువు వద్దకు నడిపించితిరి. ఎవరైనా దేవుని చూడాలి అనుకొంటే, ఆలయముకన్నా ముందు పేదలను, కష్టాల్లో ఉన్నవారిని దర్శించాలని ఈయన నమ్మేవాడు. ఈయన తన విశ్వాసాన్ని తన క్రియాశీలతకు పునాదిగా ఉపయోగించి పేద వర్గాలలో అవిశ్రాంతంగా పనిచేశాడు. ఈయన కార్మిక, సహకార ఉద్యమాలలో లోతుగా పాల్గొన్నాడు, కార్మికుల హక్కులు, మహిళల ఓటు హక్కు, శాంతి కోసం వాదించాడు. ఈయన 1928లో జపనీస్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ మరియు నేషనల్ యాంటీ-వార్ లీగ్ని స్థాపించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తర్వాత, కొత్త ట్రాన్సిషనల్ జపనీస్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశాడు. ప్రపంచ రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఉద్దేశించిన 1950-51 అసెంబ్లీకి ఈయన సహ-స్పాన్సర్గా ఉన్నాడు. ఈయన సాహిత్య రచనలు, మొత్తంగా 150కి పైగా, ఈయన వేదాంతపరమైన అంతర్దృష్టులను సామాజిక విమర్శలతో కలిపి ఉన్నాయి. చురుకైన సామాజిక మార్పుతో క్రైస్తవ విశ్వాసాన్ని ఏకీకృతం చేసిన సంఘ సంస్కర్తగా ఈయన వారసత్వం జపాన్లో, ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని పొందుతూనే ఉంది. బ్రదర్ బక్త్ సింగ్ గారు 1938లో టొయోహికో కగావా ఆహ్వానంతోనే సువార్త ప్రకటించేందుకు జపాన్లోని కోబే నగరాన్ని తొలి సారిగా సందర్శించారు. ఆ సమయంలో కోబే ప్రాంతం క్రైస్తవ విలువలు, సామాజిక సేవల పరంగా ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నది. ఈ అభివృద్ధికి టొయోహికో కగావా ప్రభావం ముఖ్యంగా కారకంగా ఉంది.

జపాన్, కోబెలో 1888 ఏప్రిల్ 10న జన్మించిన టోయోహికో, వ్యాపారవేత్త, ఉంపుడుగత్తెల కుమారుడు, ఈయన తల్లిదండ్రులు తన చిన్న వయసులోనే మరణించారు. ఈయనను ఒక పాఠశాలకు పంపగా, అక్కడ ఇద్దరు అమెరికన్ మిషనరీలు డాక్టర్ హ్యారీ మయ్యర్స్ మరియు డాక్టర్ చార్లెస్ లోగన్ ఇంగ్లిష్ బోధనతో పాటు క్రైస్తవ విశ్వాసం పరిచయం చేశారు. ఈయన క్రైస్తవుడిగా మారిన తర్వాత కుటుంబ సభ్యులు ఈయనను తిరస్కరించారు. ఈయన టోక్యో ప్రెస్బైటేరియన్ కాలేజీ మరియు కోబే థియాలజికల్ సెమినరీల్లో విద్యనభ్యసించాడు. కానీ అక్కడి బోధన ప్రధానంగా సిద్ధాంతాలపైనే కేంద్రీకరించబడి ఉండటం ఈయనకు నచ్చలేదు. ఈయన అభిప్రాయం ప్రకారం, క్రైస్తవ్యము మాటలకే పరిమితం కాకుండా, జీవితంలో క్రియాశీలంగా ఉండాలి అని వాదించాడు. తర్వాత, ఈయన అమెరికాలోని ప్రిన్స్టన్ థియాలజికల్ సెమినరీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. అక్కడ సిద్ధాంత ధర్మశాస్త్రంతో పాటు ఎంప్రియాలజీ (గర్భావస్థ అధ్యయం), జన్యుపరమైన శాస్త్రం (జెనెటిక్స్), పురావస్తు శాస్త్రం (పాలియోంటాలజీ) వంటి విజ్ఞానశాస్త్రాలు కూడా అభ్యసించాడు.

1909లో కగావా కోబేలోని మురికివాడ ప్రాంతంలోకి వెళ్లి మిషనరీగా, సామాజిక కార్యకర్తగా, సమాజవేత్తగా పని ప్రారంభించాడు. ఈయన అమెరికాలో పేదరికాన్ని అధ్యయనం చేసి, 1916లో “Researches in the Psychology of the poor” అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ గ్రంథం పేదల జీవితంలోని కఠిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. 1920 లలో కార్మిక హక్కుల కోసం ఉద్యమం చేసిన కారణంగా ఈయనను రెండు సార్లు అరెస్టయ్యి, విడుదలైన తర్వాత, 1923లో వచ్చిన మహా భూకంపానంతరం సహాయ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించాడు. 1925లో సార్వత్రిక వయోజన పురుషుల ఓటు హక్కును పొందడంలో సహాయపడింది, ఇంకా శాంతి, మహిళల ఓటు హక్కుపై దృష్టి సారించింది. 1936లో ఈయన అమెరికాలో 100,000 మందికి ఓ సభలో ప్రసంగించి ఇటాలియన్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా విరోధించాడు. 1940లో జపాన్ చైనాను ఆక్రమించినందుకు ఈయన చైనాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పి, మరోసారి అరెస్టయ్యాడు. కగావా రచనా ప్రతిభాశాలి, అనేక పుస్తకాలు రాశాడు. ఈయనకు సాహిత్యంలో, శాంతి రంగాల్లో నోబెల్ బహుమతి కోసం సిపార్సు చేయబడ్డాడు.

1955 మార్చిలో, హృదయ సంబంధిత వ్యాధి ఎక్కువవడంతో కగావా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో, కుటుంబసభ్యులు, సహచరులు ఆందోళన చెందుతున్నా, ఈయన మాత్రం రచన, ఉపదేశం, ప్రాజెక్టుల పర్యవేక్షణను కొనసాగించేవాడు. ఈయన ఆరోగ్యం సంవత్సరాల పాటు క్రమంగా క్షీనిస్తూ, మరింతగా పడిపోవడంతో, 1960 ఏప్రిల్ 23న మూడు గంటల పాటు అచేతనంగా ఉన్న అనంతరం కొద్దిసేపు మేలుకుని, తన భార్య, ఇతరులను చూసి నవ్వి, చివరగా అన్న మాటలు ఇవే : “ప్రపంచ శాంతికోసం, జపాన్లోని చర్చికోసం మీవంతు కృషి చేయండి.” ఈయన క్రీస్తును గురించి చేసిన బోధలు కేవలం బోధలుగా మాత్రమే కాకుండా, అవి తాను సాధించిన విజయాలుగా మిగిలిపోయాయి.

జాన్ మైఖేల్, రాజమండ్రి.

Leave a comment