ఆయన సన్నిధిని వెతకండి

“దేవుడి పేరిట చేసే కార్య్రమాల కంటే దేవుడి సన్నిధే ప్రాముఖ్యం”. దేవుడి నామాన్ని రోషంగా ప్రకటిస్తూ, నేటి క్రైస్తవ సంఘ దుస్థితిని ఏడు దశాబ్దాలకు ముందే చెప్పి హెచ్చరించిన దైవజనుడు ఐడెన్ విల్సన్ టోజర్ అన్న మాటలివి. నేటి క్రైస్తవంలో మన కళ్ళెదుట కనబడుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పిన హెచ్చరికలు మన కోసమే అనిపిస్తుంది. నేటి క్రైస్తవంలో సభల జోరు, సంఘాల్లో కార్యక్రమాల హోరు ఎక్కువయ్యింది. వీటిలో పాల్గొనడమే ఆధ్యాత్మికత అని తలంచే భ్రమలోకి చాలామంది వెళ్ళిపోయారు. చేస్తున్న కార్యక్రమాలు, పెడుతున్న సభలు దేవుని చిత్త ప్రకారమే జరిగిస్తున్నామా, వాటి పైన ఆయన ప్రసన్నత ఉందా అన్న విషయం ఎవ్వరికీ పెద్దగా పట్టట్లేదు. వీటిలో పాల్గొంటే చాలు ఆశీర్వాదం దానంతట అదే వచ్చేస్తుంది అన్నది అనేకుల అపోహ.

భయం లేని నమ్మకం

ఆదాము పాపం చేసినప్పటి నుంచీ భయం మనిషి జీవితంలో అంతర్భాగం అయిపోయింది (ఆది.3.10). భారతీయ జన సామాన్యంలో ఇది మరీ ఎక్కువ. తుమ్మినా భయం చిమ్మినా భయం, పిల్లి అంటే భయం బల్లి అంటే భయం, నలుపంటే భయం చీకటంటే భయం. మనకి వాస్తు భయాలు, శాప భయాలు, ముహూర్త భయాలు, జాతక భయాలు, దయ్యాల భయాలు, దిష్టి భయాలు ఉన్నాయి. ఇటువంటి సమాజంలో పుట్టి పెరిగిన క్రైస్తవులకూ ఈ భయాలు పట్టుకోవడం సహజమే మరి!